Sunday, April 26, 2020

శ్రీ భోళాశంకర భక్తురాలు

బెజ్జ మహాదేవి వోలె భజనలు వ్రాయగా లేదామె
భక్తబాంధవులను పిలిచి భోజనాలు‌ వడ్డించలేదామె

శివ సాన్నిధ్యం చేరే ముందర ఉసురు పోయిన
శరీరమునకు పూసిన బూడిద విభూది సమమామెకు

సకల చరాచర వస్తువులందూ సదాశివునే దర్శించే
సనాతన నమ్మిక ఆమెది సగుణోపాసన నిర్వచించెను

రాతిలో స్వామిని అనుభూతించెను రోలి రోకలినే అర్చించెను
నీటిని గంగని అభిషేకించెను సైకతమె విభూతి అని అలంకరించెను

నుదుటిపై జారే జలములకడ్డుగ త్రినేత్రుని
నయనముల కాచగ తన హస్తములనే హద్దులు చేసెను

అర్ధనారీశ్వరుడని పసుపు కుంకుమ పువ్వును పెట్టెను
అన్నీ స్వామి అంశలే అని ఆకులు ఫలములు నైవేద్యమనెను

శిరమున నిలిచిన శశి వోలే నేత్రమైన దినకరుని వోలె
ప్రియ పుత్రులైన వక్రతుండ వల్లీపతి వోలే

పుడమి అంతా తిరిగి ప్రదక్షిణ చేయలేనని నీరుగారలేదు
కపటం లేని భక్తి ఉంటే సాధ్యం కానిది లేదని తలచెను

తానున్న చోటే కైలాసమనెను ఆత్మ ప్రదక్షిణ గావించెను
కరములు చేసే ప్రతి పని స్వామికి చేసే సేవేననుకొనె

కలముతొ వ్రాసే పదములు ఢమరుకం లోనివె
కనుకే అంతా కామేశునికే అర్పణ‌‌ అనుకొనె

పదములు వేసే ప్రతి అడుగూ పర్లీనాధుని వైపే ననుకొనే
మనమున వచ్చే తలపులు అన్నీ మాహేశుని గూర్చే చేసే

ఇంతకన్నా భాగ్యం ఇలన ఇంకేమున్నదనే
ఇహపరములన్నీ స్వామి ఇచ్చే అని తెలుసుకొనే

No comments: